Shahrukh Khan: ఐశ్వర్యారాయ్ మేనేజర్ దుస్తులకు అంటుకున్న మంటలు.. కాపాడిన షారుఖ్ ఖాన్!

  • దీపావళి సందర్భంగా అమితాబ్ ఇంట్లో వేడుకలు
  • ఐశ్వర్య మేనేజర్ లెహంగాకు అంటుకున్న మంటలు
  • వేగంగా స్పందించి మంటలను ఆర్పిన షారుఖ్

ఐశ్వర్యారాయ్ మేనేజర్ అర్చనను కాపాడిన షారుఖ్ ఖాన్ రియల్ హీరో అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 27న అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ తారలు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ సందర్భంగా తన కూతురుతో పాటు ఐశ్వర్యారాయ్ మేనేజర్ అర్చన లాన్ లో తిరుగుతున్నారు. పొరపాటున అక్కడున్న దీపానికి ఆమె లెహంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. భయంతో ఆమె కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆక్కడున్న వారంతా షాక్ కు గురై అలాగే చూస్తూండి పోయారు.

ఆ సమయంలో అమితాబ్ తో మాట్లాడుతున్న షారుఖ్ మాత్రం వేగంగా స్పందించారు. ఆమె వద్దకు పరుగులు తీసి, తన జాకెట్ సాయంతో మంటలను ఆర్పేశారు. అనంతరం ఆమెను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో అర్చనకు 15 శాతం గాయాలయ్యాయని, ఆమె త్వరగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. మరోవైపు, షారుఖ్ కూడా ఈ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటం గమనార్హం.

More Telugu News