Chandrababu: ​నేను సన్నాసినా? ఈ కేసీఆరే ఓ నక్కజిత్తుల మాయలమారి: గురజాల రోడ్ షోలో చంద్రబాబు

  • ఆ తర్వాత సోనియా రాక్షసి అన్నాడు
  • అసలు సన్నాసివి నువ్వే కేసీఆర్
  • డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయన్నా ఇచ్చావా!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురజాల రోడ్ షోలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తనను కేసీఆర్ సన్నాసి అనడంపై చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. "కేసీఆర్ నన్ను సన్నాసి అంటున్నాడు. నేను సన్నాసినంట! ఎవరు సన్నాసి కేసీఆర్? తెలంగాణలో ఉన్న డ్వాక్రా సంఘాలు కూడా నేను పెట్టినవే. ఇక్కడ నేను మా చెల్లెమ్మలకు డబ్బులు ఇస్తుంటే, నువ్వు తెలంగాణ డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదు. ఇప్పుడు చెప్పు... నువ్వా సన్నాసివా? నేనా?

గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా దేశంలో నరేంద్ర మోదీ సర్కారు రైతుల నడ్డివిరగ్గొట్టింది. ఈ సమయంలో తెలంగాణలో రైతుల అభివృద్ధి 0.2 శాతమే. కానీ మేం వ్యవసాయ రంగంలో 11 శాతం అభివృద్ధి సాధించాం. మీ రాష్ట్రంలో మీ కూతురిపైనే 100 మంది రైతులే పోటీచేసే పరిస్థితి వచ్చింది. సిగ్గుందా మీకు?" అంటూ నిలదీశారు.

"మన ఉలవచారు తెలంగాణలో పశువులు తింటాయని అంటాడు, మన బిర్యానీ పేడ బిర్యానీ అట! మనల్ని తరిమి తరిమి కొడతాడట. నువ్వు కొట్టేవరకు మేం చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఇప్పుడు ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తానని అంటున్నాడు. ఈ కేసీఆర్ మాటల మీద ఉండే వ్యక్తి కాదు. నక్కజిత్తుల మాయలమారి. ఊసరవెల్లి రాజకీయాలకు పెట్టింది పేరు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తానన్నాడు. ఆ తర్వాత సోనియా గాంధీ రాక్షసి అన్నాడు.

ఈ కేసీఆర్ ఎక్కడ పెరిగాడు? ఏ పార్టీలో పెరిగాడు? ఇప్పుడు పెద్ద నాయకుడు అయిపోయాడా?  సాగర్ నీళ్లు కావాలంటే పోలీసులను పంపిన ప్రబుద్ధుడు ఈ కేసీఆర్! సాగర్ కు నీళ్లివ్వొద్దని, డెల్టాకు నీళ్లివ్వొద్దని, పోలవరం వద్దని అడ్డుతగులుతుంటాడు. పోలవరంపై కోర్టుకు వెళ్లింది ఆయన కూతురే!" అంటూ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News