Andhra Pradesh: కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారు!: ప్రశంసలు కురిపించిన వీహెచ్

  • చంద్రబాబు ఒక్కరే హోదా కోసం పోరాడుతున్నారు
  • అందుకే కేంద్రం ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది
  • కేసీఆర్ మోదీని తిడితే, జగన్ పొగడటం దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారనీ, అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఎన్నికల సంఘం కక్షసాధింపు చర్యలు చేపట్టడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మాత్రం ఏపీ తరహాలో అధికారులను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని బయట తిడుతున్న కేసీఆర్ లోపల మాత్రం అడ్జస్ట్ మెంట్ అవుతున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వి.హెచ్ మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని ఓవైపు కేసీఆర్ తిడుతుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు.

పాత కేసులను మాఫీ చేసుకోవడానికే జగన్ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు నాలుగురోజుల ముందు సీఎస్ ను మార్చడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తించడాన్ని తానెప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News