వ్యాధులను నివారించే విమలాదిత్యుడు

కాశీ క్షేత్రానికి వెళ్లాలనే ఆలోచన చేయగానే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యభగవానుడు కొలువైన 12 ఆలయాలు కనిపిస్తాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ, పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి వాటిలో 'విమలాదిత్యుడు' కొలువైన ఆలయం ఒకటి.

పూర్వం 'విమలుడు' అనే రాజు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్యా బిడ్డలను వదిలి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభవానుడు ప్రత్యక్షమై, కుష్టువ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించిన మూర్తి .. విమలాదిత్యుడు పేరుతో పూజలందుకుంటుందని అంటాడు. విమలాదిత్యుడిని పూజించినవారికి వ్యాధులు .. బాధలు .. దారిద్ర్య దుఃఖాలు ఉండవని సెలవిస్తాడు. అందువలన కాశీ క్షేత్రానికి చేరుకున్నవారు , ఇక్కడి సూర్య దేవాలయాలను తప్పకుండా దర్శించుకుంటూ వుంటారు.


More Bhakti News