కుజ దోషాలను తొలగించే సుబ్రహ్మణ్యుడు

శ్రీవల్లీ .. దేవసేనలతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పూజలు అందుకునే క్షేత్రాలు ఎన్నో వున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా 'మల్లామ్' కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో 'మల్లామ్' విశిష్టమైనదిగా .. విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. శ్రీవల్లీ దేవసేనలతో కలిసి స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారనీ .. ఆయన మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే సర్ప దోషాలు తొలగిపోతాయని చెబుతారు. స్వామివారి దర్శనంతో కుజ దోషాలు తొలగిపోతాయని అంటారు. సంతానం లేక బాధపడేవారు, స్వామివారి ధ్వజా రోహణం రోజున ప్రత్యేక ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఆయన అనుగ్రహంతో ఎంతోమంది సంతానాన్ని పొందినట్టుగా చెబుతారు. మొండి వ్యాధులతో బాధపడేవారు స్వామివారికి అనునిత్యం ప్రదక్షిణలు చేయడం వలన, ఆ వ్యాధుల నుంచి బయటపడతారని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. స్వామివారి అనుగ్రహంతో ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు.   


More Bhakti News